మాజీ ముఖ్యమంత్రి, గవర్నర్ కె .రోశయ్య చేతుల మీదుగా దర్శకుడు క్రిష్ కె.వి. రెడ్డి అవార్డు ను అందుకున్నారు. ‘యువకళావాహిని’ ఆధ్వర్యంలో హైదరాబాద్‌ రవీంద్రభారతిలో ఫిబ్రవరి 22న కె.వి. రెడ్డి అవార్డు ప్రదానోత్సవం ఘనంగా జరిగింది. కె.వి. రెడ్డి తక్కువ చిత్రాలే తీసినా అన్నీ జన రంజకం గా రూపొందించారని… ఆ చిత్రాలు తెలుగు వారి హృదయాలలో చిరస్థాయిగా నిలిచిపోయాయని రోశయ్య అన్నారు.

తెలుగు చలన చిత్ర రంగానికి గౌరవాన్ని ఆపాదించిన దర్శకులలో కె.వి. రెడ్డిగారు అగ్ర గణ్యుడని సిరివెన్నెల సీతారామశాస్త్రి అన్నారు. ప్రపంచ చలన చిత్ర రంగానికి పాఠ్యాంశాలుగా నిలిచిన అలనాటి చిత్రాలను నేటి దర్శకులు అధ్యయనం చెయ్యాలని అన్నారు. కె.వి. రెడ్డిగారి అవార్డు అందుకోవడమంటే జీవిత సాఫల్య పురస్కారాన్ని అందుకోవడంతో సమానమని, అవార్డు గ్రహీత క్రిష్ పెరిగిన బాధ్యతతో మరింత మంచి చిత్రాలు చెయ్యాలని అన్నారు.

తన చిత్రంలోని డైలాగ్‌ 'జనం చూసేదే మనం సేయాల' అనేదే కె.వి. రెడ్డి గారు అనుసరించిన విధానమని అవార్డు గ్రహీత క్రిష్ అన్నారు. 'మాయాబజార్' కు సరితూగే చిత్రం ఇంతవరకు రాలేదని, 'తోట రాముడు' ను మించిన కమర్షియల్ హీరో లేడని అన్నారు. చిత్ర నిర్మాణంలో కె.వి. రెడ్డి గారి స్ఫూర్తి తో… తప్పటడుగులు వేసినా, తప్పుటడుగులు పడకుండా పయనిస్తానన్నారు.

సారిపల్లి కొండలరావు అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమం లో కె.వి. రెడ్డి గారి తనయుడు కె. రామచంద్రారెడ్డి, డా. కె.వి. కృష్ణ కుమారి, గీతాంజలి, తమ్మారెడ్డి భరద్వాజ, బుర్రా సాయిమాధవ్, జె.బి. రాజు, 'సంధ్య ఫిల్మ్స్' రవి కనగాల, వై.కె. నాగేశ్వర రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా 'శృతిలయ ఆర్ట్స్ అకాడమీ' ఆమని సమర్పణ లో కె.వి. రెడ్డి – క్రిష్ చలన చిత్ర సంగీత విభావరి ఆహుతులను అలరించింది.
Cinerangam

Cinerangam

All About Cinema

Post A Comment: