ఫిలిం క్రిటిక్స్‌ అసోసియేషన్‌ నూతన కార్యవర్గం ఎన్నికలు ఆదివారం హైదరాబాద్‌ సోమాజీగూడలోని ప్రెస్‌క్లబ్‌లో జరిగాయి. ఈ రోజు జరిగిన సర్వసభ్య సమావేశంలో నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. అసోసియేషన్‌ అధ్యక్షుడుగా బి.ఎ. రాజు, ఉపాధ్యక్షుడుగా లక్ష్మీనారాయణ, కార్యదర్శిగా మడూరి మధు, సంయుక్త కార్యదర్శిగా సాయి రమేష్‌, కోశాధికారిగా పర్వతనేని రాంబాబు, కార్యవర్గ సభ్యులుగా దివాకర్‌, ఎల్‌. రాంబాబువర్మ, జి. హనుమంతరావు, రెడ్డి హనుమంతరావు, టి. మల్లికార్జున్‌, వీర్ని శ్రీనివాసరావు, సజ్జా శ్రీనివాసరావు, ఆర్‌.డి.ఎస్‌. ప్రకాష్‌ ఎన్నికయ్యారు. వచ్చే సంవత్సరం, అంటే 2018కి ఫిలిం క్రిటిక్స్‌ అసోసియేషన్‌ ఆవిర్భవించి 50 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా గోల్డెన్‌ జూబ్లీ ఫంక్షన్‌ను ఎంతో గ్రాండ్‌గా నిర్వహించేందుకు అసోసియేషన్‌ నిర్ణయించింది. ఫిలిం క్రిటిక్స్‌ అసోసియేషన్‌ సర్ణోత్సవ వేడుకల కమిటీ ఛైర్మన్‌గా సురేష్‌ కొండేటి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సీనియర్‌ జర్నలిస్ట్‌ కె.లక్ష్మణరావు ఈ ఎన్నికల ప్రక్రియకు రిటర్నింగ్‌ ఆఫీసర్‌గా వ్యవహరించారు. అసోసియేషన్‌ సభ్యుడు, సీనియర్‌ జర్నలిస్ట్‌ ఎల్‌. గంగాధరశాస్త్రి ఫిలిం క్రిటిక్స్‌ అసోసియేషన్‌ వెల్‌ఫేర్‌ ఫండ్‌కి లక్ష రూపాయల విరాళాన్ని అసోసియేషన్‌ అధ్యక్షుడు బి.ఎ. రాజుకు అందించారు. అలాగే ఫోటో జర్నలిస్ట్‌ మల్లాల శివరామకృష్ణ రూ.11,116/- సంస్థకు విరాళంగా అందించారు. ఈ ఎన్నికల కార్యక్రమంలో మాజీ అధ్యక్షుడు ఎ. ప్రభు, మాజీ సెక్రటరీ జయ బి., సీనియర్‌ జర్నలిస్టులు గుడిపూడి శ్రీహరి, శరత్‌కుమార్‌, 'ట్రేడ్‌గైడ్‌' వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా అధ్యక్షుడు బి.ఎ. రాజు మాట్లాడుతూ... 'నా మీద నమ్మకంతో నన్ను అసోసియేషన్‌ అధ్యక్షుడిగా ఎన్నుకున్న సభ్యులందరికీ నా ధన్యవాదాలు. అందరూ కలిసి మన లక్ష్య సాధనకు కృషి చేస్తేనే మనం అనుకున్నది సాధించగలుగుతాం. మన జర్నలిస్టుల సంక్షేమం కోసం ప్రతి ఒక్కరినీ కలుపుకొని వెళ్తూ అసోసియేషన్‌ని మరింత బలోపేతం చేయడానికి నా శాయశక్తులా కృషి చేస్తాను. మన అసోసియేషన్‌ సభ్యుడు, అసోసియేషన్‌ వెల్‌ఫేర్‌కి లక్ష రూపాయలు విరాళం ఇచ్చిన గంగాధర్‌కి మనందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను' అన్నారు.

ఫిలిం క్రిటిక్స్‌ అసోసియేషన్‌ గోల్డెన్‌ జూబ్లీ కమిటీ ఛైర్మన్‌ సురేష్‌ కొండేటి మాట్లాడుతూ... 'ఫిలిం క్రిటిక్స్‌ అసోసియేషన్‌ గోల్డెన్‌ జూబ్లీ వేడుకల నిర్వహణ బాధ్యతను నాకు అప్పగించి, నన్ను ఛైర్మన్‌గా ఎన్నుకున్న సభ్యులందరికీ కృతజ్ఞతలు. అసోసియేషన్‌లోని పెద్దల సహకారంతో, కమిటీ సభ్యుల సహకారంతో గోల్డెన్‌ జూబ్లీ వేడుకలను వైభవంగా నిర్వహించేందుకు నా వంతు కృషి చేస్తాను. కనీ వినీ ఎరుగని రీతిలో అందరికీ గుర్తుండిపోయేలా గోల్డెన్‌ జూబ్లీ ఫంక్షన్‌ను గొప్ప ఈవెంట్‌గా చేస్తానని ఈ సందర్భంగా హామీ ఇస్తున్నాను' అన్నారు.

వైస్‌ ప్రెసిడెంట్‌ లక్ష్మీనారాయణ మాట్లాడుతూ... 'అసోసియేషన్‌ ఎన్నికలు ఎంతో ప్రశాంతమైన వాతావరణంలో జరిగాయి. మమ్మల్ని కమిటీ సభ్యులుగా ఎన్నుకున్న ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. మా నూతన కార్యవర్గం ముందున్న ప్రధాన కర్తవ్యాల్లో మొదటిది హెల్త్‌ కార్డులు, రెండోది అక్రిడేషన్‌, మూడోది డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఫ్లాట్లు. ఈ మూడు ప్రధానమైన అంశాలపై మా నూతన కార్యవర్గం విశేషంగా కృషి చేస్తుంది. అందరి సహకారంతో తప్పకుండా మంచి ఫలితాలు సాధిస్తామన్న నమ్మకం నాకు వుంది' అన్నారు.

సెక్రటరీ మడూరి మధు మాట్లాడుతూ... 'నన్ను సపోర్ట్‌ చేసిన ప్రతి ఒక్కరికీ థాంక్స్‌. అసోసియేషన్‌లోని సభ్యులందరి సంక్షేమం కోసం అహర్నిశలు కృషి చేస్తామని ఈ సందర్భంగా హామీ ఇస్తున్నాను' అన్నారు.
Cinerangam

Cinerangam

All About Cinema

Post A Comment: