భారతీయ సినీ ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూసిన ‘బాహుబలి – ది కంక్లూజన్’ ప్రచార చిత్రాన్ని గురువారం హైదరాబాద్‌లో ఆవిష్కరించారు. అందరి అంచనాలకు తగ్గట్టే ట్రైలర్ చాలా ఘనంగా ఉంది. చూసిన ప్రేక్షకులు ప్రతి ఒక్కరు ఊపిరి బిగబట్టి మరీ వీక్షిస్తున్నారు. ప్రభాస్ వాయిస్ ఓవర్‌తో మొదలయ్యే ఈ ట్రైలర్‌లో సినిమాలోని కీలకమైన సన్నివేశాల్లో వచ్చే కొన్ని మాటల్ని, విజువల్స్‌ని చూపెట్టారు. ముఖ్యంగా కట్టప్ప బాహుబలిని చంపడానికి ముందు, కత్తితో పొడిచిన తర్వాతి దృశ్యాలను మెరుపు వేగంతో చూపించి అప్పటి వరకు ఉన్న ఉత్సుకతను ఇంకాస్త ఎక్కువ చేశాడు జక్కన్న. ప్రభాస్, రానాల మధ్య జరిగే పోరాట దృశ్యాలైతే శిఖర స్థాయిలో ఉన్నాయని చెప్పొచ్చు. భారీ శరీర సౌష్టవంతో వాళ్ళిద్దరూ వీరోచితంగా తలపడుతుంటే కనురెప్ప వేయడానిక్కూడా కష్టంగానే ఉంది. మొదటి భాగంలోనే యుద్ధ సన్నివేశాలతో రోమాలు లేచి నిలబడేలా చేసిన రాజమౌళి ఈ రెండో భాగంలో యాక్షన్, ఎమోషన్ మోతాదును ఇంకా పెంచాడని ట్రైలర్ చూస్తే ఇట్టే అర్థమైపోతోంది.

ఇక ట్రైలర్లో అమితంగా ఆకట్టుకుంటున్న మరో అంశం అనుష్క. సాధారణంగా కాస్త బొద్దుగా ఉన్న అనుష్కను రాజమౌళి తన మాయాజాలంతో చాలా నాజూగ్గా, అందంగా చూపించాడు. ప్రభాస్, అనుష్కల మధ్య రొమాన్స్ తెర మీద రసవత్తరంగా పండినట్టు సులభంగానే తెలిసిపోతోంది. చివరగా పెద్దన్న కీరవాణి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అయితే ట్రైలర్ స్థాయిని రెట్టింపు చేసింది. యుద్ధ సన్నివేశాలు, ఇతర ముఖ్య సన్నివేశాల్లో ఆయన పనితనం గొప్పగా ఉంది. ట్రైలర్ లోని విఎఫ్ఎక్స్ వర్క్ చూస్తుంటే విజువల్ గా మొదటి భాగం కంటే ఈ భాగం కొన్ని రెట్లు ఎక్కువ ఘనంగా ఉండేలా ఉంది.

పార్ట్-1 విడుదల సందర్భంగా వచ్చిన ఫీడ్ బ్యాక్, కామెంట్స్ ను రాజమౌళి లెక్కలోకి తీసుకున్నాడనే విషయం పార్ట్-2 ట్రయిలర్ చూస్తే అర్థమౌతుంది. మొదటి భాగంలో రాజమౌళి మార్క్ ఎమోషన్ మిస్ అయిందని, గ్రాఫిక్స్ పైనే ఎక్కువ ఫోకస్ పెట్టాడని విమర్శలు వచ్చాయి. తాజాగా విడుదలైైన ట్రయిలర్ లో మాత్రం రాజమౌళి మార్క్ ఫ్రేమ్స్, ఎమోషన్స్ స్పష్టంగా కనిపించాయి. మొత్తం మీద ట్రైలర్ చూసిన వారంతా భళా రాజమౌళి.. సాహో ‘బాహుబలి’ అంటున్నారు.


ప్రచార చిత్రం ఆవిష్కరణ సందర్భంగా చిత్ర సమర్పకుడు కె.రాఘవేంద్రరావు మాట్లాడుతూ ‘‘ప్రచార చిత్రం చూశాక మాటల్లేవు. వెండితెరకు మాటలు వస్తే... ‘నాపై ఇంత అద్భుతాన్ని ఆవిష్కరిస్తారనుకోలేదు’ అంటూ ఆశ్చర్యపోతుంది. ఈ చిత్రానికి పనిచేసిన నటీనటులు, సాంకేతిక నిపుణులు అదృష్టవంతులు. ఈ ట్రైలర్‌ని ప్రతీరోజూ పదిసార్లయినా చూస్తా’’ అన్నారు. ‘‘వర్షానికి ముందు ఉరుములు వస్తాయి. ట్రైలర్‌ కూడా ఉరుములాంటిదే. సినిమా విడుదల అయినప్పుడే వాన పడినట్టు. ఆ ధారలో తడిసినప్పుడే నిజమైన ఆనందం. ఏప్రిల్‌ 28 తరవాత అలాంటి అనుభూతి కలుగుతుందన్న నమ్మకం ఉంద’’న్నారు సంగీత దర్శకుడు కీరవాణి. ‘‘ఐదేళ్ల ప్రయాణం ఇది. ఇప్పుడు ముగింపు దశకు వచ్చాం. ‘బాహుబలి’ ఫ్రాంఛైసీ ఇక ముందు కూడా కొనసాగుతుంద’’ని శోభు యార్లగడ్డ చెప్పారు. ‘‘ప్రేక్షకులు ఊహించిన దానికంటే అద్భుతంగా ఉంటుందీ చిత్రమ’’ని ఛాయాగ్రాహకుడు సెంథిల్‌ తెలిపారు. నటుడు సుబ్బరాజు మాట్లాడుతూ ‘‘ఈ సినిమా ఎప్పుడొస్తుందా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వాళ్లందరికంటే మేము ఇంకా ఎక్కువ ఆత్రుతతో ఈ సినిమా రిలీజ్ కోసం ఎదురుచూస్తున్నాం’’ అన్నారు. రానా మాట్లాడుతూ ‘‘నటుడిగా ఏడేళ్లు పూర్తయ్యాయి. అందులో ఐదేళ్లు ‘బాహుబలి’ టీమ్‌తోనే సరిపోయింది. మాహిష్మతీ అనే గొప్ప సామ్రాజ్యాన్ని ఏప్రిల్‌ 28న చూడబోతున్నాం. ఇంత గొప్ప చిత్రంలో భాగస్వామ్యం కావడం ఆనందంగా ఉంద’’న్నారు.

‘‘ప్రచార చిత్రం చాలా బాగుంది. ఐదేళ్ల కష్టాలన్నీ ఈ ఒక్క ట్రైలర్‌తో మర్చిపోయాం. రెండు పాత్రలు పోషించినా అమరేంద్ర బాహుబలి పాత్ర కోసమే ఎక్కువగా కష్టపడ్డా. రాజమౌళి అన్ని ఎమోషన్లనీ చక్కగా తీస్తారు. అయితే రొమాన్స్‌ విషయంలోనే కాస్త వీక్‌. ఈ విషయం ఆయనకి చాలాసార్లు చెప్పా. ‘బాహుబలి 2’లో కొన్ని షాట్స్‌ చూస్తే... ఆ లోటు కూడా తీరిపోయిందనిపించింది. ఇప్పుడు రాజమౌళిలో ఒక్క మైనస్‌ కూడా లేద’’న్నారు ప్రభాస్‌. కార్యక్రమంలో కమల్‌కణ్ణన్‌ తదితరులు పాల్గొన్నారు.

ప్రభాస్‌ కథానాయకుడిగా నటించిన ఈ చిత్రంలో రానా, అనుష్క, తమన్నా ప్రధాన పాత్రలు పోషించారు. ఎస్‌.ఎస్‌.రాజమౌళి దర్శకత్వంలో ఆర్కా మీడియా సంస్థ తెరకెక్కించింది. శోభు యార్లగడ్డ. ప్రసాద్‌ దేవినేని నిర్మాతలు. ఏప్రిల్‌ 28న సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
Cinerangam

Cinerangam

All About Cinema

Post A Comment: